ముషీరాబాద్/ చిక్కడపల్లి, జూలై19: నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలో మొత్తం తొమ్మిది నూతన డ్రైనేజీ పైపులైన్ పనులకు గాను రూ. కోటి 42 లక్షలు మంజూరయ్యాయి. సోమవారం గాంధీనగర్ డివిజన్ జవహర్నగర్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ పావని వినయ్కుమార్తో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రజలకు డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కోట్లాది రూపాయలతో కొత్త డ్రైనేజి పైపులైన్ పనులను చేపట్టామని తెలిపారు.
ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తున్న సమస్యలను పరిష్కరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాంట్రాక్టర్లు పనులలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్వర్క్స్ సీజీఎం ఆనంద్నాయక్, జీఎం సుబ్బారాయుడు, డీజీఎం చంద్రశేఖర్, మేనేజర్ వేణుగోపాల్ నాయకుడు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీకాంత్, గుండు జగదీశ్ బాబు, కృష్ణ, ఆకుల శ్రీనివాస్, భాస్కర్, హనుమంతు, దేవయ్య, వెంకంటేశ్, బీజేపీనాయకులు వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు
ముషీరాబాద్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రెండు విభాగాల అధికారులు, సిబ్బంది సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగకుండా ఉంటుందన్నారు. సోమవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో కలిసి ముషీరాబాద్ డివిజన్లోని పలు బస్తీలో పర్యటించి ప్రజా సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. డివిజన్లోని ఆదర్శకాలనీ, గంగపుత్ర కాలనీ, పార్సిగుట్ట, చేల మార్కెట్ ప్రాంతాల్లో పర్యటించి ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణ పనులు, డ్రైనేజీ లీకేజీ సమస్యల తీరును పరిశీలించి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఆదర్శనగర్లో మోటార్ల ద్వారా మురుగు నీటి తరలింపు నిలిచిపోకుండా చూడాలని, పార్సిగుట్ట రోడ్డులో మురుగు నీటి లీకేజిని వెంటనే అరికట్టాలని సూచించారు. అదేవిధంగా చేపల మార్కెట్, గంగపుత్ర కాలనీలో మట్టికుప్పల తొలగింపు, అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. చేపల మార్కెట్లో మ్యాన్హోళ్ల నిర్మాణం పటిష్టంగా ఉండేలా చూడాలని కోరారు. జలమండలి సీజీ ఎం ఆనంద్ నాయుడు, జీఎం సుబ్బారాయుడు, డీజీఎం హాజి, మేనేజర్లు కృష్ణమోహన్, రమణ, జీహెచ్ఎంసీ సర్కిల్-15 ఈఈ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ సన్ని, ఏఈ తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, గోవింద్, డి. శివముదిరాజ్, రవియాద్, మల్లేశ్యాదవ్, శ్రీకాంత్గౌడ్, భిక్షపతియాదవ్ పాల్గొన్నారు.