ఎర్రగడ్డ, సెప్టెంబర్ 26: బస్తీల్లో మెరుగైన సదుపాయాలను కల్పించటానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. బోరబండ డివిజన్లో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన ఆదివారం రూ.65 లక్షలతో సీవరేజీ, తాగునీటి పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరేండ్ల క్రితం వరకు అభివృద్ధికి నోచుకోని బోరబండ నేడు అభివృద్ధితో బంగారుబండగా రూపు దిద్దుకున్నదని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం ఎప్పటికప్పుడు తనకు వివరించి బాబా ఫసియుద్దీన్ చురుకైన పాత్ర పోషిస్తున్నాడని కితాబిచ్చారు.
సమస్యలను పరిష్కరించటానికి అధికారులతో మాట్లాడి అవసరమైన నిధులను మంజూరు చేశామని తెలిపారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ బోరబండలో పుట్టి పెరిగిన తనకు ప్రతి గల్లీ గురించి అవగాహన ఉన్నదని.. ప్రాధాన్యత క్రమాన్ని బట్టి అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. డివిజన్లోని రాజ్నగర్, వినాయకరావునగర్, భారత్నగర్, స్వరాజ్నగర్, ఇందిరానగర్ బస్తీల్లో పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రహ్మత్నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, ప్రధాన అనుబంధ కమిటీలకు చెందిన నేతలు ఎన్.విజయకుమార్, భూపతిరెడ్డి, వెంకటేశ్, రమేశ్యాదవ్, లక్ష్మణ్గౌడ్, ఆనంద్, లడ్డు, శంకర్ పాల్గొన్నారు.
బంజారాహిల్స్,సెప్టెంబర్ 26: రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ ఫేజ్ వన్ బస్తీలో నీటి సరఫరాను మెరుగుపర్చేందుకు కొత్త పైప్లైన్ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్పొరేటర్ సీఎన్రెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్తీల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. లైన్వల్ల ఇందిరానగర్, భరత్నగర్ ప్రాంతాల్లో నీటి కష్టాలు తీరుతాయన్నారు. రూ.53.9లక్షల వ్యయంతో పలు ప్రాంతాల్లో వాటర్ పైప్లైన్ పనులు పూ ర్తిచేశామని వెల్లడించారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు.