బంజారాహిల్స్, సెప్టెంబర్ 22 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడా లేని విధంగా రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని ఆరోగ్యనగర్లో నిర్మించతలపెట్టిన మోడల్ అంగన్వాడీ భవనం ఆదర్శంగా నిలువనుందని ఎమ్మెల్యే గోపీనాథ్ అన్నారు. భవన నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాట్కో ట్రస్ట్ భాగస్వామంతో 300 గజాల స్థలంలో రూ. 30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారని, మూడు నెలల్లోనే పనులు పూర్తి చేస్తారని తెలిపారు. విశాలమైన తరగతి, వంటగది, పిల్లలు ఆడుకునేందుకు ఆటస్థలం ఉంటాయని ఆయన చెప్పారు. నిర్మాణంలో వాడుతున్న ప్రత్యేక ఇటుకల కారణంగా సాధారణంగా ఉండే ఉష్టోగ్రతకంటే తక్కువగా ఉంటుందన్నారు. గ్రేటర్ పరిధిలో ఇలాంటి అంగన్వాడీ కేంద్రం నిర్మించడం ఇదే తొలిసారని, ఈ మోడల్ అంగన్వాడీ భవనం నిర్మాణం పూర్తయితే నియోజకవర్గంలో మరో నాలుగు బస్తీల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇదే తరహాలో అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధ్ది పనులు జరుగుతున్నాయని, అభివృద్ధ్దితో పాటు పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రహ్మత్నగర్ కార్పొరేటర్ సీఎన్.రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీవో వెంకటరమణి, సూపర్వైజర్ రబిత, నాట్కో ట్రస్ట్ ప్రతినిధులు యాదగిరి, మదన్, రాంబాబు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.