బంజారాహిల్స్,ఆగస్టు 4: పేదల సంక్షేమమే లక్ష్యం గా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్లో కొత్తగా మంజూరైన 414 రేషన్ కార్డులను కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తో కలిసి బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ పేద ప్రజల ఆకలితీర్చేందుకు కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం మం జూరు చేసిందని, నియోజకవర్గంలో రేషన్ కార్డులు రానివారందరూ దరఖాస్తు చేసుకోవాలని, వారికి కార్డులు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్నాయన్నారు. తమ నియోజకవర్గంలో కొత్తగా రేషన్ కార్డులు పొందినవారికి కార్డుతో పాటు కానుకలు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వెంగళరావునగర్, ఆగస్టు 4: అట్టడుగు, బడుగు, బలహీన వర్గాలతో పాటు పేదల సంక్షేమం కోసం తపించే ప్రభుత్వం టీఆర్ఎస్అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం వెంగళరావునగర్ డివిజన్ జవహర్ నగర్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్కు చెందిన 220 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశామన్నారు. కార్డులతో పాటు తన వంతు సాయంగా గిన్నెలు, ప్లేట్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.