బంజారాహిల్స్/జూబ్లీహిల్స్,జూలై 17: తలసేమియా బాధిత చిన్నారులను ఆదుకునేందుకు మంత్రి కేటీఆర్ జన్మదినం రోజున తలపెట్టిన మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్నగర్, వెంగళ్రావునగర్, యూసుఫ్గూడ డివిజన్ల పరిధిలో టీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొని మాట్లాడారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 24న కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో చేపట్టిన మెగా రక్తదాన శిబిరంలో 3 వేలమందికి పైగా రక్తదానం చేసి రికార్డు సృష్టించాలని ప్రణాళికలు పెట్టుకున్నామన్నారు. కరోనా కష్టకాలంలో రక్తం దొరక్కపోవడంతో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. రక్తదానం చేయడం అంటే ప్రాణాలు కాపాడడమే అని టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. రక్తదానం చేయాలనుకునే వారంతా ముందుగానే ఆయా డివిజన్ల కార్పొరేటర్లతోపాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులవద్ద పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, దేదీప్యరావు, బండారి రాజ్ కుమార్ పటేల్, రాజ్కుమార్ పటేల్తో పాటు డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.