ఎర్రగడ్డ, ఏప్రిల్ 2: అసంపూర్తి పనులకు యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేస్తామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం బల్దియా అధికారులతో కలిసి ఎర్రగడ్డ డివిజన్లో విస్తృత పర్యటన జరిపారు. డివిజన్లో వెనుకబడి ఉన్న ప్రభాత్నగర్ బస్తీకి అధిక సమయాన్ని కేటాయించి అక్కడి సమస్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా బల్దియా డీఈఈ నవీన్, ఈఈ రాజ్కుమార్, ఏఈ సునీల్లకు ఎమ్మెల్యే గోపీనాథ్ పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభాత్నగర్లో అవసరమైన మార్గాల్లో ముందుగా సీసీరోడ్ల నిర్మాణానికి అంచనా వ్యయాన్ని తయారు చేయాలని సూచించారు.
ఈ బస్తీ నుంచి కల్యాణ్నగర్ వెంచర్-3, హెచ్ఎఫ్నగర్, సారథినగర్ కాలనీలవైపున్న రహదార్లను విస్తరించి వాహనాల రాకపోకలకు అనువుగా మార్చాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సీసీరోడ్ల నిర్మాణ పనులను చేపట్టి పూర్తి చేయాలని పేర్కొన్నారు. డివిజన్లోని ఆనంద్నగర్, సుల్తాన్నగర్, బి.శంకర్లాల్నగర్, ప్రేమ్నగర్ తదితర బస్తీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఆయా పనులు త్వరితగతిన పూర్తయ్యేలా గుత్తేదార్లను ఆదేశించాలని అధికారులతో అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహ్మద్ షరీఫ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు డి.సంజీవ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వెంగళరావునగర్: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న బల్దియా అధికారుల పై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కలంగా నిధులు ఉన్నప్పటికీ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ పనుల్లో అలసత్వం వహిస్తున్నారని కల్యాణ్నగర్ వెంచర్-1 సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన శుక్రవారం కల్యాణ్నగర్ వెంచర్-1లో జరుగుతున్న పనులను వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్యతో కలిసి పరిశీలించారు. పార్కు పనుల్లో జాప్యానికి గల కారణాలను అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీవాసులు, కల్యాణ్నగర్ సంక్షేమ సంఘం నాయకుల సమక్షంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్తో పోన్లో మాట్లాడారు. స్థానిక అధికారులతో పాటు పార్కుకు సంబంధించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ముందుకుసాగడం లేదని ఆయన జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం పనులను చేపడతామని ఎమ్మెల్యేతో జోనల్ కమిషనర్ అన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులు, కాంట్రాక్టర్ పై తగుచర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ ఎమ్మెల్యేకు చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ కల్యాణ్నగర్ వెంచర్-1లో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలంలో సుందరమైన పార్కును నిర్మించాలని గతంలో మంత్రి కేటీఆర్ దృష్టికి తను తీసుకెళ్లానని ఆయన ఆదేశాలతో సుమారు రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి తగుచర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చూపిన చొరవను కాలనీవాసులు, సంక్షేమ సంఘం నాయకులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్-19 డీఈ నవీన్కుమార్, అర్బన్ బయోడైవర్సిటీ అధికారి యూసుఫ్ పాషా, కృష్ణకాంత్ పార్కు సూపర్వైజర్ మహబూబ్ అలీ, టీఆర్ఎస్ నాయుకులు విజయ్ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ శ్యామ్రావుముదిరాజ్, కల్యాణ్నగర్ వెంచర్-1 సంక్షేమ సంఘం నాయకులు సత్యనారాయణ, సత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.