జూబ్లీహిల్స్,జూన్17: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం యూసుఫ్గూడ సవేరా ఫంక్షన్హాల్లో నియోజకవర్గంలోని 142 మంది లబ్ధిదారులకు రూ.కోటి 42 లక్షల 16 వేల 472 విలువైన చెక్కులను కార్పొరేటర్లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ తండ్రుల ఆవేదనను చూసిన సీఎం కేసీఆర్ మనసులో నుంచి పుట్టిందే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని తెలిపారు. సీఎం కేసీఆర్ రూపొందించిన పథకాలు ఆ యన మానస పుత్రికలని, సంక్షేమ పథకాలు మానవతాదృక్పథంతో ప్రవేశపెట్టినవేనని పేర్కొన్నారు.
ఆసరా పథకం ఆత్మగౌరవంతో బతికేలా చేసిందని.. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతోమందిని ఆదుకుంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పేదలకోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ వీఆర్వో లు విజయ్ కుమార్, విజయుడు, కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్య రావు, వనం సంగీతా యాదవ్ పాల్గొన్నారు.
ఖైరతాబాద్, జూన్ 17 : కొవిడ్ కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించి కేసులు గణనీయంగా తగ్గాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో ఆడపడుచులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.37, 04, 292ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 37 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొవిడ్ దేశాన్ని మొత్తం కుదిపేసిందని, అన్ని రాష్ర్టాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయన్నారు. మన రాష్ట్రంలో సీఎం దీర్ఘకాలిక ప్రణాళికలతో, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ సమస్య నుంచి గట్టెక్కించారని, లాన్డౌన్ సమయంలో అన్నపూర్ణ పథకం ద్వారా పేదల ఆకలి తీర్చారని, ప్రతి ఇంటికి రూ.1,500 నగదుతో పాటు నిత్యావసరాలు అందజేశారన్నారు.
కరోనా కట్టడికి రాష్ట్ర ప్ర భుత్వం తీసుకున్న చొరవ, చర్యలకు దేశ, విదేశాల నుంచి ప్రశంసలు కురిపిస్తున్నారని అన్నారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర సీఎంలు స్వయంగా ప్రశంసిస్తూ.. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం తీసుకున్న చర్యలను ఆదర్శంగా తీసుకోవాలంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న పారదర్శక పాలనను తమిళనాడు సీఎం అభినందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసీల్దార్ అశోక్ కుమార్, వీఆర్వో రాములు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు గజ్జెల అజయ్, ప్రవీణ్ కుమార్, గజ్జెల ఆనంద్ పాల్గొన్నారు.