వెంగళరావునగర్, మే 28: రోడ్డు పై వరద నీరు నిల్వకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంపీ, జలమండలి శాఖ అధికారులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశించారు. సోమాజిగూడ డివిజన్ పరిధిలోని వెస్ట్ శ్రీనివాస్నగర్కాలనీకు వెళ్లే రోడ్డుపై వర్షం వచ్చిన ప్రతిసారి నీరుచేరి చెరువును తలపిస్తుంది. వర్షం వచ్చిన ప్రతిసారి శ్రీనివాస్నగర్ కాలనీ, అమీర్పేట ప్రధాన రహదారితో పాటు ఎస్సార్నగర్ వైపునకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ సమస్యను స్థానికులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శుక్రవారం అధికారులతో కలిసి వచ్చి శ్రీనివాస్నగర్ కాలనీని సందర్శించారు. సమస్య పరిష్కారానికి అవసరమైన పైపులైను పనుల కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన నిధులు సమకూర్చుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు కాలనీవాసులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అప్పుఖాన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.