కేపీహెచ్బీ కాలనీ, మే 17 : రానున్న వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షంనీటి కాలువల విస్తరణ పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం మూసాపేట, అల్లాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు కొడిచెర్ల మహేందర్, సబీహాబేగం, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్కుమార్, కాలనీలు, బస్తీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, జీహెచ్ఎంసీ, ఆరోగ్య విభాగం అధికారులతో ఎమ్మెల్యే టెలీకాన్ఫరెన్స్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మూసాపేట డివిజన్లో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం కోసం చేపట్టిన పనులు 80 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు.
అల్లాపూర్ డివిజన్లోని రాజీవ్గాంధీనగర్, సఫ్దర్నగర్లలో దోమలను నియంత్రించడంపై ఎంటమాలజీ సిబ్బంది కృషి చేయాలన్నారు. బాటిల్నెక్ ప్రాంతాలలో ఆక్రమణలను తొలగించి నీటి ప్రవాహం సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చిన ఉచిత అంబులెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు అనారోగ్య సమస్యలుంటే 040-21111111 నంబర్కు ఫోన్ ద్వారా సంప్రదిస్తే అవసరమైన వైద్య సహకారాన్ని అందించనున్నట్లు తెలిపారు.