కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 19 : ఖాళీ స్థలాలన్నింటినీ పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దుతూ క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్డులోని జీహెచ్ఎంసీ ప్లే పార్కును ఎమ్మెల్యే కృష్ణారావు సందర్శించి వసతులు, క్రీడాకారులకు కావాల్సిన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ మొదటి ఫేజ్లో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని ఆహ్లాదకరమైన పార్కు, క్రీడా ప్రాంగణాల సముదాయంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ పార్కులో క్రీడలకు సంబంధించి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలందరూ క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.