బాలానగర్, జూలై 19 : ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. సోమవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహాయాదవ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి డివిజన్లో పర్యటించి ప్రజలను స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటి పరిష్కారం కోసం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ ప్రజల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలిపారు. డివిజన్ ప్రజల సంక్షేమం కోసం ఇప్పటికే కోట్లాది నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తిచేస్తున్నామన్నారు.
కళింగ ఎన్క్లేవ్, హెచ్ఏఎల్ కాలనీలో డ్రైనేజీ సమస్య తెలెత్తిన ప్రాంతాన్ని సందర్శించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వల్లబ్నగర్ ఈద్గాలో ప్రార్థనలు నిర్వహించుకోవడానికి ఈద్గా మైదానంలో సీసీతో మరమ్మతులు చేయడం కోసం రూ. 1 కోటి నిధులు కేటాయించారు. హరిజనబస్తీలో కూలిపోయిన కమ్యూనిటీహాల్ భవనాన్ని పునర్నిర్మించేదుకు కావాల్సిన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. ముస్లిం గ్రేవ్యార్డ్ను పరిశీలించి అత్యంత ఆధునిక సదుపాయాలతో సుందరీకరణ చేయడం కోసం రూ. 2 కోట్లు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. హస్మత్పేట, భవానీనగర్ శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయనున్నట్లు తెలిపారు.
హస్మత్పేట చెరువు మత్తడి కారణంగా గతేడాది పలు ప్రాంతాలు ముంపునకు గురైన సందర్భంలో రూ.1.60 కోట్లతో వంతెన పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆయా పనులు ఈ నెలలో పూర్తి కానున్నాయన్నారు. వంతెన అందుబాటులోకి వస్తే హస్మత్పేటలో ముంపు సమస్య తప్పినట్లే అని సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త నర్సింగ్రావు ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించారు. కార్యక్రమంలో మూసాపేట డీసీ రవికుమార్, ఈఈ గోవర్ధన్గౌడ్, ఏఈ అరవింద్కుమార్, టీఆర్ఎస్ నాయకులు నరేందర్గౌడ్, కర్రె జంగయ్య, సయ్యద్ ఎజాజ్, ఇర్ఫాన్, ఖదీర్, హరినాథ్, పోచయ్య, మట్టి శ్రీను, యాదిగిరి తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్లో బాబు జగ్జీవన్రామ్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి, అధికారులు, దళితసంఘాల నేతలతో కలిసి బాలానగర్లో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల బాలానగర్లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన సందర్భంలో ఫ్లై ఓవర్కు బాబు జగ్జీవన్రామ్ పేరు పెడుతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో బాలానగర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్రామ్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, మందడి సుధాకర్రెడ్డి, అంబటి సునిల్కుమార్, ఖాజ, రత్నం, ఎడ్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ, జూలై 19 : వరదనీటి కాల్వలన్నింటినీ ఆధునీకరించి ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బాలాజీనగర్ డివిజన్లోని ముళ్లకత్వ చెరువు నుంచి కాముని చెరువు, మైసమ్మ చెరువు వరకు గొలుసుకట్టు చెరువు నాలాలను జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొలుసుకట్టు చెరువులకు సంబంధించిన వర్షంనీరు కాల్వలో కుచించుకుపోవడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని, తద్వారా సమీపంలోని కాలనీలు, బస్తీల్లోకి వరదనీరు వచ్చిచేరుతుందన్నారు.
నాలాల ఆక్రమణలు పెరగడంతో కొన్నిచోట్ల బాటిల్నెక్ ప్రాంతాలుగా మారిపోయాయన్నారు. గొలుసుకట్టు చెరువుల నాలాలను పునరుద్ధరించకుంటే భవిష్యత్లో మరిన్ని సమస్యలు తలెత్తుతాయన్నారు. ఆయా విభాగాల అధికారులు సంయుక్తంగా నాలాలను పరిశీలించి వాటిని అభివృద్ధి చేసేందుకు స్పష్టమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. నాలాల అభివృద్ధికి పూర్తిస్థాయి నివేదికను త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ శంకర్ నాయక్, తాసీల్దార్ గోవర్ధన్, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు తదితరులు ఉన్నారు.