కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 23 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఎన్హెచ్ – 44పై జంక్షన్ల అభివృద్ధితో పాటు ఫ్లై ఓవర్లు, ఆరు లేన్ల రోడ్డు నిర్మాణ పనులకు భారత జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ కూడా చురుగ్గా సాగుతున్నది. త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఆమోద పత్రాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ క్యాంపు కార్యాలయం నుంచి విడుదలజేశారు. నిత్యం ట్రాఫిక్తో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దూరం చేసేందుకు సుచిత్ర జంక్షన్ అభివృద్ధి, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి చొరవ చూపాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.
సమస్యను అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి భారత జాతీయ రహదారుల సంస్థ అధికారులతో సమీక్షించారు. మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్లడంతో రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్వయంగా పర్యటించి సమస్యను పరిశీలించారు. సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలుపడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
ఎన్హెచ్ఏఐ ఆమోదంతో రూ.492 కోట్ల వ్యయంతో త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వివరించారు. సుచిత్ర జంక్షన్, జీడిమెట్ల జంక్షన్, ధూలపల్లి జంక్షన్, కొంపల్లి జంక్షన్ అభివృద్ధితో పాటు డెయిరీ ఫామ్ నుంచి సుచిత్ర మీదుగా ధూలపల్లి, కొంపల్లి వరకు ఆరు లేన్లతో కూడిన మూడు ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు, 10 కిలోమీటర్ల పరిధిలో ఇరువైపులా ఏడు మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారని తెలిపారు.
డెయిరీ ఫామ్ నుంచి సుచిత్ర జంక్షన్ వరకు 2,075 మీటర్ల పొడవు వంతెన, జీడిమెట్ల జంక్షన్ నుంచి సినీ ప్లానెట్ వరకు 560 మీటర్ల పొడవు, ధూలపల్లి జంక్షన్ నుంచి కొంపల్లి జంక్షన్ వరకు 1160 మీటర్ల పొడవు వంతెనల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.