గోల్నాక, జూలై 14 : వర్షాకాలం నేపథ్యంలో ముంపు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో ఆయన సమీక్షాసమావేశం నిర్వహించారు. నియోజకవర్గం ఐదు డివిజన్లలోని పలు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న వరద, మంచినీటి, డ్రైనేజీ పైపులైన్ల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించాలని అన్నారు. అదే విధంగా వర్షాకాలం నేపథ్యంలో మంచినీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ కలుషిత తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జలమండలి అధికారులు జీఎం సుబ్బారాయుడు, డీజీఎంలు సన్యాసిరావు, సతీశ్, ఏఈలు కుషాల్, రోహిత్, భావన, శేఖర్, వర్క్ఇన్స్పెక్టర్ అక్షక్, బాలకృష్ణ పాల్గొన్నారు.