బంజారాహిల్స్,మే 5: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని హిందూశ్మశానవాటికను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. నగరంలోని శ్మశానవాటికల్లో సమస్యలను పరిశీలించాలంటూ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని హిందూ శ్మశానవాటికను సందర్శించారు. ఈ సందర్భంగా శ్మశానవాటికలో పరిస్థితులను పరిశీలించిన మేయర్ మాట్లాడుతూ.. ఈ శ్మశానవాటికను రూ.1.50 కోట్లతో మహా ప్రస్థానం తరహాలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే డిజైన్లను రూపొందించారని, త్వరలో నిధులు మంజూరు చేయించడంతో పాటు పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డీఎంసీ ఇస్లావత్ సేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా.. పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో విద్యుత్ దహనవాటిక డిజైన్ లోపం వల్ల విపరీతమైన పొగ, దూళి వ్యాపిస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఫిర్యాదులతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అక్కడకు వెళ్లి పరిశీలించారు. సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.