కాచిగూడ,మే 5: నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని నెహ్రూనగర్, కమేళా తదితర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి అధికారులతో బుధవారం ఎమ్మెల్యే కాలేరు పర్యటించి ప్రజల నుంచి నీటి, డ్రైనేజీ సమస్యలను తెలుసుకున్నారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. నెహ్రూనగర్ బస్తీలో ఏండ్లనాటి తుప్పుపట్టిన డ్రైనేజీ పైపులైన్ల ద్వారా కలుషిత నీళ్లు వస్తున్నాయని, లోప్రెషర్ సరఫరాతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే కాలేరుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే నెహ్రూనగర్, కమేళాలో ఏండ్లనాటి డ్రైనేజీ పైపులను తొలగించి నూతన పైపులను వేయాలని జలమండలి అధికారులను అదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తేలేదని, డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామన్నారు. నియెజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేస్తూ, అన్ని సదుపాయలు కల్పించేందుకు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కరానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే అధికారులు వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ అధ్యక్షుడు భరత్రాజ్ముదిరాజ్, భూపతి లక్ష్మణ్, కాలేరు రామకృష్ణ, నర్సింగ్యాదవ్, రెడపాక రాము, లక్ష్మీముదిరాజ్, బాల్రాజు, కాలేరు రాజు, సాయి, కాలేరు శ్రావణ్, యూసుఫ్షరీఫ్, ప్రవీణ్, అరవింద్, పి.సంతోష్, ప్రభాకర్ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.