కాచిగూడ,ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రంలోని దళితుల సాధికారత కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తళితబంధు పథకం దేశానికే ఆదర్శమని,ముఖ్యమంత్రికి వెంటనే భారతరత్న ఇవ్వాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అ న్నారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని హుజురాబాద్ కేంద్రంగా తొలుత ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నిక కోసం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో వారికి తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం విద్య, వైద్యం, పలు సంక్షేమ పథకాలతో పాటు మూడెకరాల భూమిని పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. 80 ఏండ్ల భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు దళితుల మనుగడ కోసం ఆలోచించే నేతలే కరువయ్యారని అన్నారు. తెలంగాణలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సీఎం కేసీఆర్ పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపొతుందని ఆయన వెల్లడించారు.
ఓట్ల కోసం మాత్రమే ఆలోచించే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇప్పటికీ దళితులపై దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎస్సీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనచరిత్ర సీఎం కేసీఆర్కే దక్కిందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో నిధులు మంజురు చేసిన గొప్ప మనసున్న మహారాజు కేసీఆర్ అనడంలో అతిశయోక్తి లేదని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తెలంగాణలో ముఖ్యమంత్రి పేద దళిత కుటుంబాలకు దళితబంధు పథకాన్ని అమలుచేసి తిరుతాడని ఆయన అన్నారు.