అంబర్పేట, జూలై 28 : దేశంలోనే ఏ పట్టణంలో లేనివిధంగా హైదరాబాద్ నగరంలో ఉచిత మంచినీటి పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నెలకు 20వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా అందించే పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, జలమండలి అధికారులతో కలిసి ఆయన ఛే నంబర్లోని మహారాణాప్రతాప్ ఫంక్షన్హాల్లో బుధవారం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సుమారు 50వేల నల్లా కనెక్షన్లు ఉండగా ఇప్పటి వరకు పదివేల మంది మాత్రమే ఆధార్ను అనుసంధానం చేసుకున్నారని, మిగతా 40వేల మంది ఇంకా చేసుకోలేదని అన్నారు.
అందుకే కార్పొరేటర్లు, జలమండలి అధికారులు తమ డివిజన్లలో ప్రతి బస్తీ, కాలనీకి వెళ్లి ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోపు నల్లా కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ను అనుసంధానం చేసుకొని మీటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మీటర్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని జలమండలి అధికారులకు తెలియజేస్తే వారు కంప్యూటర్లో నమోదు చేస్తారని, అప్పటి నుంచి నల్లా నీరు ఉచితంగా పొందవచ్చునని పేర్కొన్నారు. ఎవరైతే గడువులోగా ఆధార్ అనుసంధానం, మీటర్ ఏర్పాటు చేసుకోలేదో వారికి గడిచిన తొమ్మిది నెలల బిల్లు కలిపి వస్తుందని చెప్పారు. స్లమ్లలో నివాసముండే వారు మీటర్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారికి జలమండలి అధికారులు ఆధార్ను అనుసంధానం చేశారని వెల్లడించారు.
అపార్ట్మెంట్లలో ఉన్న వారు కూడా ఆధార్ను అనుసంధానించుకోవాలని, అందులో ఇద్దరు అనుసంధానం చేసుకోకున్నా వారికి బిల్లు వస్తుందని, అందుకే అందరూ ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని చెప్పారు. అలాగే ఏ బస్తీలో కూడా కలుషిత మంచినీరు, లోప్రెషర్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్పొరేటర్లు దూసరి లావణ్య, వై.అమృత, బి.పద్మావెంకటరెడ్డి, కన్నె ఉమారాణి, జలమండలి జీఎం సుబ్బరాయుడు, డీజీఎంలు సతీశ్, సన్యాసిరావు, మేనేజర్లు రోహిత్, కుశాల్, జాకీర్, మాజిద్, భావన, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, నాయకులు కన్నె రమేశ్యాదవ్, దూసరి శ్రీనివాస్గౌడ్, శ్రీరాములుముదిరాజ్, చంద్రశేఖర్గౌడ్, రాము, వినోద్ తదితరులు పాల్గొన్నారు.