అంబర్పేట, జూన్ 9: నాలాల్లో పూడికతీతను సక్రమంగా చేపట్టాలని గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. అంబర్పేట నియోజకవర్గంలో నాలాలు, పారిశుధ్య పనులను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్లతో కలిసి మేయర్ పరిశీలించారు. మొదట గోల్నాకలో నాలా వద్దకు వెళ్లిన మేయర్ అక్కడి నాలాలో పూడికతీత పనులు జరగలేదని గమనించి.. వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. అనంతరం అంబర్పేట డివిజన్ బాపూనగర్ వద్ద డ్రైనేజీ లైన్ను పరిశీలించారు. బాపూనగర్లో వరదనీరు, డ్రైనేజీ మురుగు రెండు కలిసి ఉండడం వల్ల డ్రైనేజీ బ్లాక్ అవుతున్నదని గమనించిన మేయర్ వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పారు.
బతుకమ్మకుంటలో స్వచ్ఛ ఆటోలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తుండటంతో స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని బస్తీవాసులు మేయర్కు వినతిపత్రం ఇచ్చారు. దీనికి స్పందించిన మేయర్ పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ ల్యాండ్ వారి సహాయం తీసుకొని గేట్ ఓపెన్ చేయించి అక్కడి డెబ్రిస్ను తొలగించి స్వచ్ఛ ఆటోలకు పార్కింగ్ కల్పించాలని అధికారులకు చెప్పారు. అలాగే నల్లకుంట శివానందనగర్ నాలాను పరిశీలించిన మేయర్ డీషిల్టింగ్ పనులను మూడు అడుగుల లోతు వరకు తీసి చెత్తను క్లీన్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో పాటు కార్పొరేటర్లు దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, వై.అమృత, బి.పద్మావెంకటరెడ్డి, కన్నె ఉమారాణి, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతి, డీసీ వేణుగోపాల్, ఏఎంఓహెచ్ డా.హేమలత, ఈఈ శంకర్, డీఈ సంతోష్ పాల్గొన్నారు.
బాగ్అంబర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ కె.పద్మావతి ఆధ్వర్యంలో ఛే నంబర్ చౌరస్తాలో బుధవారం ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరై ప్రజలకు మాస్కులను అందజేశారు. కార్పొరేటర్లు దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, పద్మావెంకటరెడ్డి, నాయకులు పి.గిరిధర్గౌడ్, శ్రీనివాస్యాదవ్, మహేందర్, ఎం.ఎస్.రెడ్డి, చేతన్, జమీల్, హబీబ్, అంజి, అనివాశ్ తదితరులు పాల్గొన్నారు.