అంబర్పేట/కాచిగూడ, జూన్ 8: తాగునీటి లోప్రెషర్ సమస్య పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో పురాతన పైపులైన్ల స్థానంలో కొత్త పైపులైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాగ్అంబర్పేట డివిజన్లోని పోచమ్మబస్తీ, ప్రభుత్వ పాఠశాల లేన్, మిగతా అన్ని గల్లీలలో మంగళవారం ఉదయం 5 నుంచి 7 గంటల వరకు జలమండలి సిబ్బందితో కలిసి పర్యటించారు. తాగునీరు సరిగ్గా రావడం లేదని, లోప్రెషర్తో వస్తున్నదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే లో ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే తాగునీరు, డ్రైనేజీ పైపులైన్ల ఆధునీకరణకు జలమండలి ద్వారా కొత్తగా రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఏఈ మాజిద్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, బస్తీవాసులు రంగంపల్లి రాజు, విఠల్రావు, జిత్తు, శ్రీనివాస్, ప్రతాప్రెడ్డి, లింగం, బొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పార్కుల సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్ విక్రమ్నగర్ పార్కులోని వార్డు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సంబంధిత అధికారులతో సమావేశమై నియోజకవర్గంలోని పార్కుల అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 8 పార్కులను మోడ్రన్ పార్కులుగా తీర్చిదిద్దేందుకు రూ.2.98 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పార్కులలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పార్కులో వృద్ధులు, మహిళలు కూర్చోవడానికి బెంచీలు, విద్యుత్లైట్లు, సీసీ కెమెరాలు, పార్కు చుట్ట్టూ ప్రహరీ నిర్మాణం, క్రీడా పరికరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ అనిల్రాజు, ఈఈ శంకర్, డీఈలు సుధాకర్, సంతోశ్, ప్రేరణ, శ్వేత, మేనేజర్ సత్యనారాయణ, డీడీ మాలినీ, వెంకటరమణారెడ్డి, ఏఈ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.