అంబర్పేట, జూన్ 6: లాక్డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి 15 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నదని, దీన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నిజంగా పేదల పక్షపాతి అని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం బాగ్అంబర్పేట డివిజన్, కుమ్మరబస్తీలో గల రేషన్ షాపులో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది లాక్డౌన్ సమయంలో కూడా పేదలు ఇబ్బందులు పడకుండా మూడు నెలల పాటు రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని ఉచితంగా అందజేశారని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. లాక్డౌన్ వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. అయినా ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం చాలా ముఖ్యమన్నారు. కరోనా సోకిన వారు ఇంట్లో ఉండటానికి అవకాశం లేకుంటే అంబర్పేట లకోటియా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో ఉండవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీలర్ లక్ష్మయ్య, వివిధ పార్టీల నాయకులు మహేశ్, శేఖర్, ఇ.అజయ్కుమార్, సురేశ్, బాలు, అనిల్రామ్, సాయినాథ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.