ఎల్బీనగర్, జూలై 19 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని రెవెన్యూ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ హైదరాబాద్ కలెక్టర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతిని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సోమవారం కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగోలు డివిజన్ ఫతుల్లగూడలోని సర్వే నంబర్.58లోని రెండు ఎకరాల స్థలంలో ఒక ఎకరంలో ప్లే గ్రౌండ్, మరో ఎకరం స్థలంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని, నాగోలు బండ్లగూడలోని సర్వే నంబర్ 36/6లో ఉన్న ఎకరం స్థలంలో నూతన పోలీస్స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించాలని, నాగోలు సర్వే నంబర్.91 అరుణోదయకాలనీలోని 884 గజాల స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం, కొత్తపేట సర్వే నంబర్.143 శ్రీరామలింగేశ్వర కాలనీలోని 2500 గజాల స్థలంలో పార్కును నిర్మించేందుకు కేటాయించాలని కలెక్టర్ శ్వేతా మహంతిని కోరారు. అదే విధంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి నందనవనం జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ శ్వేతా మహంతి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ప్రతిపాదించిన విధంగా పనులు ప్రారంభమయ్యేలా చూస్తామంటూ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.