ఎల్బీనగర్, జూలై 17 : అభివృద్ధి పనుల విషయంలో పోటీ పడాలి కానీ, అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం జిల్లెలగూడ చెరువు అలుగుపారి ముంపునకు గురవుతున్న శివసాయి కాలనీ నుంచి చంద్రాగార్డెన్స్ వరకు ఉన్న కాలనీలను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల్లో వరదముంపు లేకుండా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంటే కొందరు రాజకీయ నాయకులు మిడిమిడి జ్ఞానంతో మా కాలనీలోకి నీరు రావద్దు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. జిల్లెలగూడ చెరువు నుంచి కాలనీలోకి నీరు పారుతున్న ప్రాంతంలో ఓ తూమును గుర్తించడం జరిగిందని, దానిని సరి చేస్తే వరదనీరు తూము నుంచి మళ్లించవచ్చన్నారు. అదే విధంగా ఓపెన్ డ్రైన్ పనులు కొంత ఆలస్యం అయిన నేపథ్యంలో వరద నీటి ఇబ్బందులు కలుగుతున్నాయని, అక్టోబర్ మాసం వరకు ఓపెన్ డ్రైన్ పనులు పూర్తి చేస్తామని, దీంతో ఈ కాలనీల్లో వరదనీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజా సేవ చేసేందుకు తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.