మన్సూరాబాద్, జూలై 14: సుష్మ చౌరస్తా నుంచి కామినేని మార్గంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ అంశాన్ని ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. సుష్మ చౌరస్తా నుంచి కామినేని మార్గంలో చేపడుతున్న రోడ్డు విస్తరణతో ఆస్తులు కోల్పోతున్న బాధితులతో బుధవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ రెడ్డి గార్డెన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుష్మ-కామినేని మార్గంలో 100 ఫీట్ల మేర రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉందని, రోడ్డు విస్తరణతో ఆస్తులు కోల్పోతున్న బాధితులు కొందరు రోడ్డు విస్తరణను 80 ఫీట్లకు కుదించాలని కోరుతున్నారని తెలిపారు. ఈ విషయంపై ఉన్నతస్థాయిలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రోజు రోజుకూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలోపెట్టుకొని భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రోడ్లను విస్తరించడం, కొత్త రోడ్లను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. సుష్మ చౌరస్తా నుంచి కామినేని మార్గంలో చేపట్టనున్న 100 ఫీట్ల రోడ్డు వెడల్పుతో 272 మంది తమ ఆస్తులను కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రోడ్డు విస్తరణను 80 ఫీట్లకు కుదించాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతానని పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్డు వెడల్పు పనులు చేపట్టామని తెలిపారు.
రాబోయే కాలంలో నియోజకవర్గం రూపురేఖలు మార్చి ప్రజల ప్రయాణాలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. నాగోల్ నుంచి గండిపేట వరకు మూసీ నదికి ఇరువైపులా 120 అడుగుల చొప్పున రోడ్లను నిర్మించి నగర ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సుష్మ నుంచి కామినేని మార్గంలో రోడ్డు విస్తరణను 80 ఫీట్ల పరిమితికే కుదించే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రసాద్రావు, ఏసీపీ ఇర్షాద్, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, వివిధ కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులు జేజే రెడ్డి, మార్గం రాజేశ్, మోహన్రెడ్డి, చీర్క నర్సిరెడ్డి, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, పారంద నర్సింగ్రావు, విజయ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.