ఎల్బీనగర్, జూన్ 11: చంపాపేట డివిజన్ బైరామల్గూడ చెరువును పక్కనున్న కాలనీవాసులకు ఇబ్బందులు కలుగకుండా సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చెరువు ప్రాంతాన్ని సందర్శించి స్థానిక కాలనీలవాసుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బైరామల్గూడ చెరువు అభివృద్ధి విషయంలో ఎవరికీ ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు. చెరువు పునరుద్ధరణలో భాగంగా జరుగుతున్న పనులతో ఎలాంటి నష్టం జరుగకుండా చూస్తామని అన్నారు. ప్రస్తుతం నాలాల్లో పూడిక నిండిపోయి నీటి ప్రవాహం తక్కువగా ఉందని, పూడికను తొలగించి పక్కకు తాత్కాలిక రోడ్డు వేయిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ ఉప కమిషనర్ సురేందర్రెడ్డి, సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్రెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.