మన్సూరాబాద్, మే 23: నాగోల్ చెరువును అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధిలోని నాగోల్ చెరువులో కొన్ని రోజుల క్రితం పూర్తిగా గుర్రపుడెక్క నిండిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చెరువును పరిశీలించారు. ఎంటమాలజీ అధికారులతో సమావేశమై యుద్ధ ప్రాతిపదికన చెరువులోని గుర్రపుడెక్కను తొలగింపజేశారు. తొలగింపు ప్రక్రియ పూర్తి కావడంతో ఆదివారం ఎమ్మెల్యే నాగోల్ చెరువును పరిశీలించి సంబంధిత అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రపుడెక్క తొలగింపు ప్రక్రియను ఎంటమాలజీ సిబ్బంది ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారని తెలిపారు. నాగోల్ చెరువు చుట్టూరా వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయించి పరిసర కాలనీల ప్రజలకు మార్నింగ్ వాక్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. చెరువు ద్వారా దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు పిచికారీ చేయిస్తామని ఆయన తెలిపారు. నాగోల్ చెరువు రూపు రేఖలు మార్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.