మన్సూరాబాద్, మే 22: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ కామినేని ఫ్లైఓవర్ కింద నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ పార్కు పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు లేనందున వెంటనే ఆయా ప్రాంతాల్లో పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనపు సిబ్బందిని నియమించి పగలు, రాత్రి పనులను చేపిస్తున్నామని చెప్పారు. సిబ్బందికి ప్రత్యేక పాసులు ఇప్పించి అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్కు పనులను జూలై చివరి వారంలోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. పార్కులో ప్రజలు వాకింగ్ చేసుకునే సదుపాయం కల్పించడంతో పాటు ఇక్కడి వచ్చే వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.