ఎల్బీనగర్, మే 17 : కొవిడ్ను సాకుగా చూపుతూ ప్రైవేట్ దవాఖానలు అధిక బిల్లులు వసూలు చేస్తే సహించేది లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీనగర్లోని ఓ కాన్ఫరెన్స్ హాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రైవేట్ దవాఖానల ప్రతినిధులతో జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి దీన్దయాళ్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ దవాఖానల సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారని, అయితే అధిక ఫీజులు వేసి ప్రజలను వేదిస్తే ఊరుకునేది లేదన్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్గా వారు చేస్తున్న సేవలను గుర్తిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ దవాఖానలు నడుచుకోవాలని, నిర్దేశించిన ధరల ప్రకారమే వైద్యం చేయాలని సూచించారు. నగరంలోని అతి పెద్ద సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో కొవిడ్ చికిత్స చేయించుకుంటే రూ. 4లక్షల నుంచి 5 లక్షలతోనే నయం అవుతుండగా, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొన్ని దవాఖానలు రూ. 15 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేయడం శోచనీయమన్నారు. ప్రజలకు కరోనా కష్ట కాలంలో మంచి సేవలు అందించాలని, చికిత్సకు తగిన ఫీజులు తీసుకుని ప్రజలను కాపాడాలన్నారు.
అధిక బిల్లులు , చికిత్స విషయంలో ఇబ్బంది పెట్టే దవాఖానలను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సీజ్ చేయిస్తామన్నారు. దవాఖానలకు వచ్చే మధ్యతరగతి, పేద వారి పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించి దయ, జాలీ చూపాలన్నారు. రోగులను భయాందోళనకు గురి చేసి ఇంజక్షన్లు ఇవ్వడం, మందుల పేరుతో మాయాజాలం చేయవద్దని సూచించారు. అవసరమైతేనే ఇంజక్షన్లు ఇవ్వాలని, మందుల పేరుతో దోపీడీ ఆపాలన్నారు. దవాఖాన యాజమాన్యాలకు చేతులెత్తి ప్రార్థిస్తున్నానని, ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు. ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, లేని పక్షంలో అధిక ఫీజుల వసూలు ప్రక్రియ కొనసాగితే దవాఖానలను సీజ్ చేయిస్తామని హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా అదనపు డీఎంహెచ్ఓ దీన్దయాళ్ మాట్లాడుతూ ప్రైవేట్ దవాఖానల యజమాన్యాలు నిబంధనల ప్రకారం వ్యవహరించాలన్నారు. కరోనా కష్ట సమయంలో ప్రజలు, ప్రభుత్వానికి సహకారం అందించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి నరేందర్రెడ్డితో పాటు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 50 ప్రైవేట్ దవాఖానల ప్రతినిధులు పాల్గొన్నారు.