ఎల్బీనగర్, మే 16 : రైతు బజార్లో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం లాక్డౌన్ నేపథ్యంలో వనస్థలిపురం రైతుబజార్ను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, రైతుబజార్ అధికారులు స్థానికంగా మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చొరవ తీసుకోవాలన్నారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గుంపులు, గుంపులుగా వస్తే కరోనా మరింత విజృంభిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుబజార్లో కూరగాయలు అమ్మే రైతులను ఒప్పించి సరి- బేసి విధానంలో కూరగాయలు అమ్మే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుబజార్ కిక్కిరిసి పోతున్నందున పక్కనే ఉన్న పార్కులోకి కొంత మేర రైతు బజార్ విక్రయాలను తరలిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా తరచుగా కూరగాయల కోసం రాకుండా వారం రోజులకు సరిపడా ఒకేసారి కొనుగోలు చేయాలన్నారు. కూరగాయల కోసం వచ్చే ప్రజలు తమ వంతు బాధ్యతగా భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతుబజార్ కార్యనిర్వహణాధికారి స్వప్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.