మన్సూరాబాద్, మే 15 : సీఎం సహాయనిధి పేదలకు సంజీవని లాంటిదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. నాగోల్ డివిజన్ విశాలాంధ్రకాలనీకి చెందిన విజేందర్రెడ్డి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ ఆపరేషన్ నిమిత్తం నగరంలోని ఓ దవాఖానలో చేరాడు. చికిత్సకు అయ్యే ఖర్చును భరించలేని స్థితిలో ఉన్న కుటుంబసభ్యులు విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి సీఎం సహాయనిధి నుంచి రూ. 3 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు. శనివారం బాధితుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతున్నదని, సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నాయకులు అనంతుల రాజిరెడ్డి, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు