ఎల్బీనగర్, మే 12: లాక్డౌన్ సమయంలోనూ కరోనా పరీక్షలు, కరోనా వ్యాక్సినేషన్ సేవలు కొనసాగుతాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం హస్తినాపురం డివిజన్లోని నందనవనం బస్తీ దవాఖానతో పాటు పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకునే వారికి ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని అన్నారు. టీకాలు, పరీక్షల కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని డిప్యూటీ డీఎంఓహెచ్ దీన్దయాల్తో ఫోన్లో మాట్లాడి చెప్పినట్లు తెలిపారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, బయటకు వచ్చే వారు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.