ఎల్బీనగర్, మే 10: నాగోలు మూసీ తీర ప్రాంతంలో త్వరలోనే 100 అడుగుల భారీ భారత మువ్వన్నెల జెండా ఎగురనుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం నాగోలు మూసీ తీర ప్రాంతంలో ఎంఆర్డీసీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, సుందరీకరణ పనులను సుధీర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీనది సుందరీకరణలో భాగంగా నాగోలు మూసీ వంతెన కింద భారీ మువ్వన్నెల జెండా త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జెండా ఏర్పాటు కోసం దిమ్మెను నిర్మించామని వెల్లడించారు. మూసీ పరివాహకంలో అభివృద్ధి పనులు, సుందరీకరణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఇరువైపులా పచ్చని చెట్లతో వర్టికల్ గార్డెన్స్ను అభివృద్ధి చేస్తున్నామని, ఐరన్ గ్రిల్స్కు సుందరమైన రంగులను అద్ది ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అనంతుల రాజారెడ్డి, లింగాల రాహుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.