మన్సూరాబాద్, ఏప్రిల్ 30: దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ప్రెస్కాలనీలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ సెంటర్తో పాటు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్షల కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో వ్యాక్సినేషన్, కరోనా పరీక్షలు నిర్వహించడం వలన టీకాలు వేయించుకునేందుకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
జిల్లా వైద్యాధికారితో మాట్లాడి కరోనా పరీక్షా కేంద్రాన్ని పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలోకి మార్చడం జరిగిందని తెలిపారు. కరోనా పరీక్షల కోసం వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా తన సొంత నిధులతో టెంట్లు, కుర్చీలు, మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి రోజు సుమారు 50 నుంచి 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కరోనా పరీక్షల కోసం వచ్చే వారు క్యూలైన్లో భౌతికదూరం పాటించడంతో పాటు మాస్కులను ధరించాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకూ ప్రబలతున్న దృష్ట్యా ప్రజలు స్వీయ రక్షణ పాటించాలని.. అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని తెలిపారు. వ్యాక్సిన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ప్రతిఒక్కరూ టీకా వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్యాదవ్, నాయకులు సిద్దగోసి జగదీశ్గౌడ్, భాస్కర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.