చంపాపేట, ఏప్రిల్ 28 : లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. లింగోజిగూడలో గెలుపొంది ప్రమాణస్వీకారం కూడా చేయకుండా మృతిచెందిన ఆకుల రమేశ్గౌడ్ పట్ల ఉన్న సానుభూతితో టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ తీర్మాణానికి ఒప్పుకొని అభ్యర్థిని బరిలో నిలపలేదని తెలిపారు.
దీనిని సద్వినియోగం చేసుకోకుండా బీజేపీలోని అంతర్ యుద్ధంలో భాగంగా కొంతమంది బీజేపీ నాయకులు టీఆర్ఎస్పై విమర్శలు చేశారని అన్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. పార్టీ ఆదేశానుసారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్కు ఏ మాత్రం మద్దతు తెలపడం లేదని వెల్లడించారు. బీజేపీ అభ్యర్థికి మద్దతు విషయం టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అభిష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్రెడ్డి గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేర్చుకునేందుకు తామే మద్దతు తెలుపుతున్నట్లు వస్తున్న వదంతులు అవాస్తవమని కొట్టిపారేశారు.