మన్సూరాబాద్/ఎల్బీనగర్/వనస్థలిపురం, ఏప్రిల్ 25: భవిష్యత్తులో కాలనీల్లో వరద ముంపు సమస్యలు తలెత్తకుండా నూతనంగా ట్రంకులైన్ నిర్మాణ పనులు చేపడుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో జడ్జెస్కాలనీతో పాటు శైలజాపురికాలనీల నుంచి నూతనంగా ఏర్పాటు చేస్తున్న వరదనీటి ట్రంకులైన్తో భవిష్యత్తులో ఏవైనా సమస్యలు ఏర్పడుతాయేమోనని సహారాస్టేట్స్ కాలనీ, హిమపురికాలనీ, ద్వారకానగర్, స్వాతిగార్డెన్, సెవన్హిల్స్కాలనీ, డీపీనగర్ కాలనీలవాసులు అనుమానం వ్యక్తం చేశారు. పలు కాలనీలవాసుల అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆదివారం ఆయన సదరు ప్రాంతాల్లో పర్యటించి కాలనీలవాసులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ట్రంకులైన్లు వరదనీటి మళ్లింపుకోసమేనని.. ఎట్టి పరిస్థితులలోను అందులో డ్రైనేజీ నీటిని కలువనివ్వమని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు చెందకుండా వరదనీటి ట్రంకులైన్ పనులు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ట్రంకులైన్ నిర్మాణాల వలన ప్రజల అనుమానాలను నివృత్తి చేసేందుకు బుధవారం మరోసారి కాలనీల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు. కాలనీలవాసుల అభిప్రాయాలను పరిగణలోని తీసుకుని ఎవరికీ అభ్యంతరం లేనిరీతిలో ట్రంకులైన్లను నిర్మిస్తామని తెలిపారు.
కరోనా మహమ్మారిని వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే దిల్సుఖ్నగర్ బస్స్టాప్, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఎంటమాలజీ సిబ్బందిచే సోడియం హైపో క్లోరైట్ ద్రావాణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని అన్నారు. నిత్యం పండ్లమార్కెట్, దిల్సుఖ్నగర్ బస్స్టాప్ల వద్ద ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సోడియం హైపో క్లోరైట్ ద్రావాణాన్ని పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పనులు ఉంటే తప్పా బయటకు రావద్దని, వచ్చినా మాస్కులు తప్పక ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ రాంనర్సింహ గౌడ్, డిప్యూటి కమిషనర్ కృష్ణయ్య, ఎంటమాలజీ అధికారులు రజిని, సిబ్బంది పాల్గొన్నారు.
కూరగాయల కోసం మార్కెట్కు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డితో కలిసి రైతు బజార్ పరిసరాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో సోడియం హైపో క్లోరైట్తో శానిటైజేషన్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పనిసరైతేనే బయటకు వెళ్లాలన్నారు. ప్రమాదకారిగా మారిన కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రైతు బజార్లో రైతులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విధిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో డీసీలు మారుతీ దివాకర్, సురేందర్రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.