బంజారాహిల్స్/ఖైరతాబాద్,అక్టోబర్ 26: ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం సోమాజిగూడలోని జయ గార్డెన్స్లో బుధవారం ఉదయం 9:30 నుంచి ప్రారంభం కానుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మంగళవారం ఫిలింనగర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ విలేకరులతో మాట్లాడుతూ.. మాదాపూర్లోని హైటెక్స్లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో భాగంగా చర్చించిన అనేక అంశాలతో పాటు ప్లీనరీలో చేసిన తీర్మాణాలను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు వివరించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఏర్పాటైన బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, యూత్ కమిటీల్లో స్థానం దక్కించుకున్న కార్యకర్తలు, నేతలందరితో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారని వివరించారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతంతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎలాంటి విధానాలు అవలంభించాలనే అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నామన్నారు. సమావేశం ప్రారంభంలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని, సమావేశం అనంతరం ఆత్మీయ విందు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే దానం పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రతి కార్యకర్త తప్పకుండా హాజరుకావాలని సూచించారు.