ఖైరతాబాద్, సెప్టెంబర్ 23 : సీఎం కేసీఆర్, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారధ్యంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా….హైదరాబాద్ విశ్వనగరంగా విరాజిల్లుతున్నదని, అందులో బస్తీలు కూడా భాగమేనని…అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ పిలుపునిచ్చారు. సోమాజిగూడలోని జయగార్డెన్స్లో గురువారం డివిజన్ నూతన కార్యవర్గం, కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పార్టీ బలోపేతంగా ఉంటేనే మనం బలంగా ఉంటామని, దేశం, రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు దిగ్విజయవంతంగా సాగుతున్నదన్నారు. రాష్ట్ర చరిత్రలోనే 60 లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ప్రభుత్వం అన్ని కులాలు, వృత్తుల వారికి అనేక పథకాలు తీసుకొచ్చి వారి అభివృద్ధికి పాటుపడుతున్నదని, ఆ వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేందుకు దోహదపడుతున్నదన్నారు.అందులో భాగంగానే మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, యువజన, మైనార్టీ, సోషల్ మీడియా విభాగాలతో నూతన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజా సేవలో వారిని భాగస్వాములను చేస్తున్నారన్నారు. బస్తీ కమిటీ సభ్యులు స్థానిక సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ప్రతి డివిజన్కు స్ఫూర్తి దాయకంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం నూతన కమిటీని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ కార్పొరేటర్ వనం సంగీతతో కలిసి ప్రకటించారు.