ఖైరతాబాద్, సెప్టెంబర్ 16 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు, అభివృద్ధి , సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నా..ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లోని బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 16 మందికి షాదీ ముబారక్, 13 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల ఆర్థిక స్థితి గతులను దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేని దళిత బంధు, రైతు బంధు, బీమా, ఆసరా పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే.. ప్రతిపక్ష నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గజ్జెల అజయ్, నాయకులు వైల ప్రవీణ్ కుమార్, మహేందర్ బాబు, గజ్జెల ఆనంద్, కరాటే రమేశ్, కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.