శ్రీనగర్కాలనీ, జూలై 30 : హుజురాబాద్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ దళితులతో కాళ్లు కడిగించుకోవడం సరికాదని, వెంటనే తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్డు నంబరు -9లో జరిగిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈటల రాజేందర్ ఏమన్న దేవుడి కొడుకా.. ఆయన దళిత సోదరులతో పాలతో పాదాలను కడిగించుకుంటున్నాడు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంది.
ఓ వైపు సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెడితే.. ఈటల దళితులను కించపరిచేలా కాళ్లు కడిగించుకున్నాడు. ఈటల ఏమి సాధించావని దళితులతో కాళ్లు కడిగించుకున్నావ్’ అని దానం ప్రశ్నించారు. దళితబంధు పథకం కేవలం హుజురాబాద్కే పరిమితం కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల దళితుల అభివృద్ధి కోసమన్నారు. ఏ పథకం చేపట్టినా.. పైలెట్ కార్యక్రమంలో భాగంగా ఒక్క ప్రాంతంలో ప్రయోగాత్మకంగా చేపట్టి.. వాటి ఫలితాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని గుర్తుచేశారు.
దళితులకు అండగా నిలబడేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెడితే ఈటల రాజేందర్తో పాటు బీజేపీ నాయకులు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈటల బామ్మర్ధి ఓ వైపు దళితులను దూషిస్తుంటే.. ఈటల వారితో పాదాభిషేకం చేయించుకుంటూ దళితులను అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు. దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటలకు హుజురాబాద్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన, మైనార్టీ, దళితుల సంక్షేమానికి పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసునని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.