మియాపూర్, సెప్టెంబర్ 13 : ఏండ్ల తరబడిగా కలుషిత తాగునీటితో సతమతం అవుతున్న ప్రజలకు నూతన పైపులైన్ల ద్వారా శాశ్వత పరిష్కారం చూపించి పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతీ గడపకు శుద్ధమైన జలాన్ని అందించే లక్ష్యంతో తమ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలో ఆల్విన్ కాలనీ ఫేజ్-1లో రూ.51.40 లక్షలతో నిర్మించిన మంజీరా పైపులైన్ పనులు పూర్తి కాగా.. కుళాయి నుంచి నీటి సరఫరాను కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి విప్ గాంధీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీరు కలుషితం అయ్యే ప్రాంతాలన్నింటినీ గుర్తించి వాటి స్థానంలో నూతన లైన్ల నిర్మాణాలను పూర్తి చేసి శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో రిజర్వాయిర్లను అందుబాటులోకి తీసుకువచ్చి తాగునీటికి ఢోకా లేకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ ప్రియాంక, పార్టీ నేతలు రంగారావు, సంజీవరెడ్డి, గణేశ్, రాజేందర్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.