హఫీజ్పేట్, ఆగస్టు 13 : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని ప్రభుత్వవిప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ఉషోదయ ఎన్క్లేవ్ హెచ్ఐజీ ఫేజ్-2లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.6.70 లక్షలతో నూతనంగా ఏర్పాటుచేసిన 32 సీసీ కెమెరాలను ప్రభుత్వవిప్ మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, కార్పొరేటర్లు పూజితగౌడ్, జగదీశ్వర్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అన్నారు. ప్రతికాలనీలో సీసీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతుగా ఎమ్మెల్యే ఫండ్ ద్వారా రూ.కోటి కేటాయించడం జరిగిందన్నారు.
హెచ్ఐజీ కాలనీవాసుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సొంత నిధులతో సీసీల ఏర్పాటుకు మందుకురావడం అభినందనీయమన్నారు. హెచ్ఐజీ కాలనీ అభివృద్ధిలో భాగంగా మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానని తెలిపారు. అనంతరం సీసీల ఏర్పాటుకు కృషిచేసిన కాలనీ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐలు రవికిరణ్, రవికుమార్, బీహెచ్ఈఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఆర్కే వాంచూ, గౌతంగౌడ్, శ్రీనివాస్యాదవ్, అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, సభ్యులు పూర్ణచందర్రావు, నర్సింహ, నాగేశ్వర్, శ్రీహరిరావు, సత్తిరాజు, బాలాజీనాయక్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్, ఆగస్టు 13 : ఎస్టీపీల ఏర్పాటుతో చెరువుల్లోకి చేరుతున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జలమండలి ఎస్టీపీ నిర్మాణ విభాగం అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం పెద్ద చెరువులో రూ.64.14 కోట్ల వ్యయంతో 20.0 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మురుగునీరు చెరువుల్లోకి చేరకముందే శుద్ధి చేయడం ద్వారా చెరువుల్లోని నీరు కలుషితమవకుండా ఉంటుందన్నారు.
చెరువుల్లో పరిశుభ్రమైన నీరు ఉండటంతో పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలుంటాయన్నారు. ఎస్టీపీల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, అతి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, జలమండలి ఎస్టీపీ విభాగం జనరల్ మేనేజర్ తిప్పన్న, డీజీఎం మురళి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.