మియాపూర్, మే27: బల్దియాలోనే తొలి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను చందానగర్ సర్కిల్లో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ జోనల్ కమిషనర్ నాగళ్ల రవికిరణ్, డీసీ నందగిరి సుధాంశ్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలను చేపట్టడం ద్వారా లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్య పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ విషయంలో జోన్ పరిధిలోని చందానగర్ సర్కిల్ అధికారులు ముందుగా ప్రత్యేక మాన్సూన్ బృందాలను రంగంలోకి దింపుతుండటం అభినందనీయమన్నారు. తమ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలను చేపట్టాలన్నారు. నాలాల్లో పేరుకుపోతున్న సిల్టు, ఇతర వ్యర్థాల తొలగింపు, డ్రైనేజీలను శుభ్రం చేయటం, మ్యాన్హోళ్లకు కావాల్సిన మరమ్మతులను ముందే పూర్తి చేయటం వంటి చర్యలను చేపట్టాలన్నారు.
గత అనుభవాల దృష్ట్యా నియోజకవర్గవ్యాప్తంగా ఆయా సర్కిళ్ల పరిధిలో ఎక్కడెక్కడ ముంపు సమస్య నెలకొన్నదో అధికారులు ముందస్తుగా నివేదిక తయారు చేసి సదరు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టితో నివారణ చర్యలను చేపట్టాలన్నారు. నీటి ప్రవాహానికి ఏమాత్రం ఆటంకం కలుగకుండా తగిన మరమ్మతులను పూర్తి చేయాలని విప్ గాంధీ సూచించారు. వరద కాలువ నిర్మాణాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయటం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆయా విభాగాలు సమన్వయం చేసుకుని పనులను చేపట్టాలని, అధికారులు అనునిత్యం అందుబాటులో ఉండి సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే చర్యలను ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ శ్రీకాంతి, డీఈలు రూపాదేవి, సురేశ్, ఏఈలు అనురాగ్, ప్రశాంత్, రమేశ్, ధీరజ్ పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, మే 27: గోపన్పల్లి పెద్ద చెరువు కట్టను పటిష్ట పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్పల్లి పెద్ద చెరువును ఇరిగేషన్, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. గత సంవత్సరం వర్షకాలంలో కురిసిన వర్షాలకు పెద్ద చెరువు కట్ట కుచించుకుపోవడం జరిగిందని, ఆ సమయంలో తాత్కలికంగా ఇసుక బస్తాలు చెరువు కట్టకు అడ్డుపెట్టి నీటి ప్రవాహాన్ని అదుపు చెయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని చెరువు కట్టను పటిష్ట పరిచే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మరమ్మతు పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఏఈ శేషగిరిరావు, జీహెచ్ఎంసీ ఎస్ఈ చిన్నారెడ్డి, డీఈ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, రఘునాథ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.