మియాపూర్, మే26: రాష్ట్రంలోనే అతి పెద్దదైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6 లక్షలకు పైగా జనాభా నివసిస్తుండగా.. ఇంత మొత్తం ప్రజానీకానికి కేవలం నాలుగు వ్యాక్సినేషన్ కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. నియోజకవర్గంలో అదనంగా మరో 11 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సహచర ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా ఇతర ప్రజా ప్రతినిధులతో జరిగిన సమీక్షా సమావేశంలో విప్ అరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం నియోజవకర్గంలో కొండాపూర్, శేరిలింగంపల్లి, హఫీజ్పేట్, ఎల్లమ్మబండ ఆరోగ్య కేంద్రాల్లోనే వ్యాక్సినేషన్ కొనసాగుతున్నదన్నారు. అదనంగా 11 వ్యాక్సిన్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఐదు బస్తీ దవాఖానలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కొండాపూర్ ఏరియా దవాఖానలో అదనపు సిబ్బందిని నియమించి సేవలను మరింత చేరువలోకి తీసుకురావాలన్నారు. కరోనా వైద్యం పేరిట నియోజకవర్గంలో ప్రైవేటు దవాఖానలు అడ్డగోలుగా ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో ప్రస్తావించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గంగారం, పటేల్ చెరువుల సుందరీకరణ పనులపై విప్ అరెకపూడి గాంధీ బుధవారం మియాపూర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.31.26 కోట్ల నిధులతో చెరువుల సుందరీకరణ పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మురుగు నీరు చెరువుల్లోకి చేరకుండా ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థ, వాన నీరు వచ్చేలా వరద కాలువల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. చెరువులను సంరక్షించుకుంటూనే చెరువుల చుట్టూ ఆహ్లాకదరమైన వాతావరణం, వాకింగ్ ట్రాక్, పచ్చని చెట్లను అభివృద్ధి పరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు శేషగిరిరావు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, టీపీఎస్ తుల్జాసింగ్, మధు పాల్గొన్నార