మియాపూర్ , మే 19 : ప్రజల సౌకర్యం కోసం నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నదని అలాంటి పనులను సకాలంలో పూర్తి చేయకుండా వదిలేస్తుండటం వల్ల లక్ష్యం నెరవేరడం లేదని ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. అసంపూర్తిగా ఉన్న పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని , ఏమాత్రం జాప్యం లేకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలో అభివృద్ధి పనులు, పెండింగ్ పనులతో పాటు సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజూలరెడ్డి, నార్నె శ్రీనివాసరావుతో కలిసి ఇంజినీరింగ్ అధికారులతో మియాపూర్లోని తన క్యాంపు కార్యాలయంలో విప్ గాంధీ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మౌలిక వసతుల కల్పన నిమిత్తం పలు పనులకు శంకుస్థాపన చేశామని, వాటిని వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రహదారులు, డ్రైనేజీలు, నాలా విస్తరణ పనుల్లో వేగం పెంచాలని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు, అందుకు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని విప్ గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈలు సుదర్శన్, శ్రీకాంత్, డీఈలు శ్రీనివాస్, రమేశ్, సురేశ్, రూపాదేవి, పార్టీ నేతలు రఘునాథ్రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.