మియాపూర్, జూన్ 20 : నియోజకవర్గ సమగ్రాభివృద్ధి విషయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా విశేష కృషి చేస్తున్నట్లు, అభివృద్ధితో ఆదర్శంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. రెండేండ్లుగా కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నా నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటూనే వసతుల కల్పన విషయంలో ముందడుగే వేస్తున్నట్లు స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లోని కమల ప్రసన్ననగర్, ఏఎస్రాజు, వెంకటేశ్వరనగర్, మాధవరం కాలనీ, ఈనాడు కాలనీ, సప్తగిరి కాలనీలలో రూ.1, 59,70, 000ల వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ పనులకు కార్పొరేటర్ మాధవరం రోజాదేవిరంగారావు, ఉప్పలపాటి శ్రీకాంత్ సహా జీహెచ్ఎంసీ అధికారులతో కలసి విప్ గాంధీ ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. శేరిలింగంపల్లిని అభివృద్ధిలో ముందంజలో నిలుపుతానని తెలిపారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో కోట్లాది రూపాయలు మంజూరు చేయించి మెరుగవసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీరాములు, ఏఈ స్వప్న, సుధాకర్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, పెద్ద భాస్కర్రావు, నాయినేని చంద్రకాంత్రావు, కార్తీక్రావు, రాంచందర్రావు, మహేశ్, రాఘవులు, విద్యాసాగర్, చంద్రమౌలి, చిన్నా, సోమేశ్, సుధాకర్, ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన 22 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి పథకం కింద మంజూరైన రూ.11.94 లక్షల చెక్కులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి విప్ అరెకపూడి గాంధీ ఆదివారం వివేకానందనగర్లోని తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. పేద ప్రజలను ఆదుకునేందుకు వారి ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసాగా నిలుస్తున్నదన్నారు. ఈ నిధిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.