మియాపూర్, జూన్ 13 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఇందుకోసం అధిక నిధుల మంజూరీకి కృషి చేస్తున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జేఎన్ఎన్యూఆర్ఎం కంటి వెలుగు కేంద్రం నుంచి సిక్కుల బస్తీ వరకు రూ. 27 .50 లక్షల నిధులతో చేపట్టబోయే యూజీడీ, సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు సహా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విప్ గాంధీ ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్లో 60 శాతం వరకు స్లమ్ ఏరియాలున్నాయని వాటిలో నెలకొన్న సమస్యలన్నింటినీ ఇప్పటికే దశల వారీగా పరిష్కరిస్తూ అధిక నిధులతో అభివృద్ధి పనులను ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అన్ని కాలనీల్లో సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణంతో ప్రజా రవాణాను మరింతగా వృద్ధి పరచటమే తన లక్ష్యమని విప్ గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్ధన్, ఏఈ సుభాష్, వర్క్ ఇన్స్పెక్టర్ బ్రహ్మం, పార్టీ నేతలు జిల్లా గణేశ్, కాశీనాథ్, బాలరాజు, శ్రీనివాస్, మున్నా, వెంకటేశ్, వెంకట్, అంజయ్య, భాస్కర్రావు, జాన్, యాదగిరి, సదానంద, రవి, మల్లేశ్, రామాంజనేయులు, లక్ష్మి, మధులత, నస్రీన్, శైలజ పాల్గొన్నారు.
వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి వివేకానంద విగ్రహం వద్ద రూ. 11 లక్షలతో చేపడుతున్న జంక్షన్ సుందరీకరణ పనులను విప్ అరెకపూడి గాంధీ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుందరీకరణ పనులతో కూడలి ఆహ్లాదకరంగా తయారవుతుందన్నారు. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న దీనిని కాలనీకే ఆదర్శంగా తీర్చిదిద్దాలని, పనులను నాణ్యతతో చేపట్టాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్ధన్, ఏఈ సుభాశ్, పార్టీ నేతలు కాశీనాథ్, వెంకట్, వాసు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్, జూన్ 13 :గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురానగర్, ప్రశాంతి హిల్స్, టీఎన్జీవో కాలనీల్లో నెలకొన్న సమస్యలతో పాటు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కాలనీ వాసులు విప్ అరెకపూడి గాంధీని ఆదివారం ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. కాలనీలో ఉన్న డ్రైనేజీ, అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత్ దీపాల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామన్నారు. కాలనీవాసులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి తోడ్పాటును అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రమేశ్, విజయలక్ష్మి, గోవింద్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.