కొండాపూర్/శేరిలింగంపల్లి , జూన్ 7 : మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్లో రూ. 12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న పైపులైన్ పనులకు డివిజన్ కార్పొరేటర్ మంజుల రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు రాష్ట్రంలో తాగునీటి సమస్యలుండేవని, ప్రస్తుతం మిషన్ భగీరథతో సమస్య తీరి ప్రతి ఇంటికీ తాగునీరు వస్తున్నదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా తాగు నీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
మిషన్ భగీరథ పథకంలో భాగంగా శేరిలింగంపల్లిలో తాగునీటి రిజర్వాయర్లను నిర్మించినట్లు తెలిపారు. ప్రతి కాలనీ, బస్తీలకు మంచినీరు చేరేలా పైపులైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డీజీఎం నాగప్రియ, మేనేజర్లు సుబ్రహ్మణ్య రాజు, సునీత, డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, మిరియాల రాఘవరావు, దాసరి గోపి, శ్రీనివాస్రెడ్డి, ప్రవీణ్, అక్బర్ఖాన్, శ్రీకాంత్రెడ్డి, గుడ్ల ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ నల్లా కనెక్షన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్లో రూ. 16 లక్షల వ్యయంతో మంజీరా పైపులైన్ నిర్మాణ పనులను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంటింటికీ నల్లా కనెక్షన్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. దాదాపు 20 వేల లీటర్ల నీటిని తాగునీటి పథకం ద్వారా అర్హులైన పేదలకు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జలమండలి జీఏం రాజశేఖర్, డీజీఏం నాగప్రియ, మేనేజర్లు సుబ్రహ్మణ్య రాజు, సునీతా పాల్గొన్నారు.