ముషీరాబాద్ : ముషీరాబాద్ డివిజన్ చేపల మార్కెట్లో డ్రైనేజీ పైపులైన్, మ్యాన్హోల్ నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేయడం పట్ల స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులపై మండిపడ్డారు. మ్యాన్హోల్స్ మూతలు ఏర్పాటు చేసిన నెల రోజులకే విరిగిపోవడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ముషీరాబాద్ చేపల మార్కెట్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. మార్కెట్లో సౌకర్యాల తీరును పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చేపల మార్కెట్కు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చేపల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు మురుగు నీటి లీకేజీ సమస్యలు తలెత్తకుండా జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని, చేపల మార్కెట్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండకుండా చూడాలని, విరిగిన మ్యాన్హోల్స్ స్థానంలో వెంటనే కొత్తవి ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.
మార్కెట్ పరిసరాల్లో గంజాయి సేవించడం వంటి అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్టవేయాలని పోలీసులకు సూచించా రు. దుర్గంధం వెదజల్లకుండా ఎప్పటికప్పుడు చెత్త, చేపల వ్యర్థాల తరలింపు చేపట్టాలని, పారిశుద్ధ్య సమస్య తలెత్త కుండా వ్యాపారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ కృష్ణమోహన్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, వి.సుధాకర్గుప్త, ఆర్.మోజస్, దీన్దయాల్రెడ్డి, సాంబశివరావు, లక్ష్మణ్ గౌడ్, డి.శివముదిరాజ్, ఎయిర్టెల్ రాజు తదితరులు పాల్గొన్నారు.