వనస్థలిపురం, ఆగస్టు 9 : డ్రైనేజీలో పడి గల్లంతైన అంతయ్య మృతదేహం సోమవారం లభ్యమైంది. ఈ నెల 3న రాత్రి శివ, అంతయ్య డ్రైనేజీ పూడిక తీసేందుకు మ్యాన్హోల్లో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పటికే శివ మృతదేహం లభ్యమవ్వగా, ఏడు రోజుల తర్వాత ఘటన జరిగిన పద్మావతి బ్యాంకు కాలనీ నుంచి సుమారు 3 వందల మీటర్ల దూరంలోని మ్యాన్హోల్లో అంతయ్య శవం దొరికింది. జెట్టింగ్ మిషన్ సహాయంతో ఒక్కో మ్యాన్హోల్ను వెతుకుతుండగా, అనంతవేణి కాలనీ వద్ద మృతదేహం కనిపించడంతో వెలికితీశారు. పైప్ లైన్లలో మట్టి పేరుకుపోయి ఉండటంతో నెమ్మదిగా కదులుతూ అక్కడి వరకు చేరి ఉంటుందని సిబ్బంది పేర్కొన్నారు. కాగా, బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అభయమిచ్చారు. సంఘటన స్థలం నుంచి ఆయన ఫోన్లో మేయర్ విజయలక్ష్మి, కలెక్టర్తో మాట్లాడారు. అనంతరం మంత్రి కేటీఆర్తో చర్చించిన కలెక్టర్.. డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుకు హామీ ఇచ్చారు. దీంతో పాటు కుటుంబసభ్యులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, వితంతు పింఛన్ ఇప్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కాగా, ఇప్పటికే బాధిత కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారాన్ని అందజేశారు.