కుత్బుల్లాపూర్,ఆగస్టు13 : కొడుకును ఉన్నత చదువులు చదివించాలనేది తల్లీదండ్రుల కోరిక… చదువుపై మక్కువ చూపని కొడుకు తీరు. అయినా ఆ తల్లీదండ్రుల కోరిక మేరకు కొడుకు బెంగళూరులో విద్యను అభ్యసించేందుకు పంపించారు. కానీ అక్కడ నుంచి ఎవరికి చెప్పాపెట్టకుండా అదృశ్యమయ్యారు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు నాలుగు నెలలుగా కొడుకు ఆచూకీ కోసం పడరాని పాట్లు పడ్డారు. ఎట్టకేలకు కొంపల్లిలో ఉన్నాడన్న సమాచారంతో పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించగా కొడుకు చెంతకు చేరడంతో ఆ తల్లీదండ్రుల ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, పదనపల్లి కి చెందిన డి.రమణ, దానమ్మ ఇద్దరు కొడుకులు.
వీరిలో పెద్దకొడుకు తరుణ్కుమార్ (21)కి మంచి చదువులను ఆందించాలనే ఆశతో బెంగళూరులోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ కోర్సులో చేర్పించారు. అక్కడే ఓ హస్టల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. చదువుపై తరుణ్కు ఇష్టం లేకపోవడంతో అక్కడి నుంచి నాలుగు నెలల కిందట ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తరుణ్ తల్లీదండ్రులు కర్ణాటకలోని పోలీసులను సంప్రదించి మిస్సింగ్ కేసును నమోదు చేశారు. కుటుంబ సభ్యులంతా బెంగళూరుతో పాటు చిత్తూరు జిల్లాతో పాటు హైదరాబాద్లో వెతకడం మొదలుపెట్టారు.
నాలుగు నెలల నుంచి తరుణ్ కోసం ఆ తల్లీదండ్రుల వెతుకులాటకు అంతు లేకుండా పోయింది. ఇటీవలే కర్ణాటక పోలీసులు హైదరాబాద్లోని కొంపల్లి ప్రాంతంలో ఉన్నాడని సలహా ఇచ్చారు. బాధితులు పేట్ బషీరాబాద్ పోలీసులను గురువారం రాత్రి ఆశ్రయించారు. స్థానిక పోలీసులు కేసును చాలెంజ్గా తీసుకొని సాంకేతిక సహాయంతో కొంపల్లిలో ఉన్నాడని తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి నేరుగా తన స్నేహితులతో ఉంటున్న తరుణ్ను శుక్రవారం అతడి తల్లీదండ్రులకు అప్పగించారు. కొడుకును చూడడంతో ఆ తల్లీదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పేట్ బషీరాబాద్ పోలీసుల పనితీరుపై బాధిత తల్లీదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.