న్యూఢిల్లీ, మే 7: రోజూ పసుపు కలిపిన గ్లాసెడు పాలు, రాగి, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్లు, మాంసం, సోయా తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి సహజంగా పెరుగుతుందని కేంద్రం సూచించింది. ముఖ్యంగా పసుపు కలిపిన పాలు ఇమ్యూనిటిని పెంచడంలో చాలా దోహదం చేస్తాయని తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైరస్ను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీ కీలకమైన కారణంగా ఈ సూచనలు చేసింది. మానసిక ఆందోళనను దూరం చేసేందుకు డార్క్ చాక్లెట్ కూడా తినవచ్చని సూచించింది. కొవిడ్ రోగుల్లో చాలా మందికి వాసన, రుచి పోతున్నాయని వీరు పచ్చిమామిడి కాయలతో చేసిన పొడిని కలిపిన జెల్లీ లాంటి మెత్తని ఆహార పదార్థాలు తింటే ఫలితం ఉంటుందని సూచించింది. యోగా, ప్రాణాయామం చేస్తే ఊపిరి సమస్యలను దూరం చేసుకోవచ్చని పేర్కొన్నది.